న్యూఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాల్లో మత ఘర్షణలు జరుగుతున్న క్రమంలో వీహెచ్పీ మహిళా విభాగం వ్యవస్ధాపకురాలు సాధ్వి రితంబర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ జంటలు నలుగురు పిల్లలకు జన్మనివ్వాలని, వారిలో ఇద్దరిని దేశానికి అందించాలని పిలుపు ఇచ్చారు.
త్వరలోనే భారత్ హిందూ రాజ్యంగా అవతరిస్తుందని రాజకీయ ఉగ్రవాదం ద్వారా హిందూ సమాజాన్ని చీల్చాలని ప్రయత్నించే వారు ఉనికి కోల్పోతారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని జహన్గిర్పురిలో శనివారం జరిగిన అల్లర్లను ప్రస్తావిస్తూ దేశ పురోగతిని సహించలేని వారు హనుమాన్ శోభా యాత్రపై దాడి చేశారని ఆరోపించారు.
హిందూ మహిళలు మేమిద్దరం..మాకిద్దరనే నినాదాన్ని అనుసరిస్తారని, అయితే హిందూ జంటలు నలుగురు సంతానానికి జన్మనిచ్చి ఇద్దరిని జాతి కోసం కేటాయించాలని ఆమె కోరారు. హిందూ జంటలు వారి పిల్లలను ఆర్ఎస్ఎస్, వీహెచ్పీలకు అప్పగించాలని అన్నారు.