చండీగఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి వస్తే ఓ డిప్యూటీ సీఎం పదవిని బీఎస్పీకి కేటాయిస్తామని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ శనివారం ప్రకటించారు ఎస్ఏడీ-బీఎస్పీ కూటమి పంజాబ్లో అధికారంలోకి వస్తే ఓ డిప్యూటీ సీఎం పదవిని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి కట్టబెడతామని బంగాలో జరిగిన ర్యాలీ అనంతరం బాదల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
తమ కూటమి ప్రభుత్వం కొలువుతీరితే ఓ ఎస్సీ ఎమ్మెల్యే, ఓ హిందూ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేస్తారని బాదల్ తెలిపారు. 2022లో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని ఎస్ఏడీ ఈ ఏడాది జూన్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇరు పార్టీల మధ్య కుదిరిన సీట్ల సర్ధుబాటు ప్రకారం 117 అసెంబ్ల స్ధానాలకు గాను 20 స్ధానాల్లో బీఎస్పీ అభ్యర్ధులు పోటీ చేయనుండగా మిగిలిన స్ధానాల్లో అకాలీదళ్ అభ్యర్ధులు ఎన్నికల బరిలో ఉంటారు. ఇక మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏర్పాటు చేసిన కొత్త పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేయనుండగా, పాలక కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా పంజాబ్ పోరులో సత్తా చాటాలని వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.