జైపూర్: కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు బజారుకెక్కుతున్నాయి. సొంత మంత్రులే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ రచ్చకెక్కుతున్నారు. ప్రభుత్వ అవినీతిపై ఇదివరకే అసమ్మతి నేత సచిన్ పైలట్ రాష్ట్రమంతా తిరిగి నిరసన తెలుపగా, తాజాగా ఓ మంత్రి సైతం సొంత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసి పదవిని కోల్పోయారు. ఆయన అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అవినీతి చిట్టాను సోమవారం అసెంబ్లీ వేదికగా బట్టబయలు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ సహచర సభ్యుడిని కొట్టి, తన్ని, సభ నుంచి లాగిపడేశారు. తాజా మాజీ మంత్రి రాజేంద్రసింగ్ గుడాను అసెంబ్లీలో అడ్డుకొనేందుకు కాంగ్రెస్ సభ్యులు సోమవారం హైడ్రామా సృష్టించారు.
సీఎం గెహ్లాట్ అవినీతి చిట్టా అంటూ రాజేంద్రసింగ్ సభకు ఒక ఎరుపు రంగు డైరీని తీసుకొచ్చారు. సీఎం అశోక్ గెహ్లాట్ అక్రమ ఆర్థిక లావాదేవీలు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలకు చేసిన డబ్బు పంపిణీ వివరాలు అందులో ఉన్నాయని ఆయన తెలిపారు.. రాజేంద్రసింగ్ ఈ రెడ్ డైరీ అంశాన్ని ప్రస్తావించగానే సభలో గందరగోళం నెలకొన్నది. రాజేంద్రసింగ్తో ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఘర్షణకు దిగారు. రెడ్ డైరీ రహస్యాలను సభకు వివరించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆయన వెల్లోకి దూసుకెళ్లారు. అయితే మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించలేదని, మంత్రి శాంతికుమార్ ధరివాల్తో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనను ‘కొట్టి, తన్ని, అసెంబ్లీ నుంచి బయటకు లాగిపడేశారు’ అని రాజేంద్ర సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
నేను చేసిన తప్పేంటి?
సస్పెండ్ అయిన అనంతరం రాజేంద్రసింగ్ మీడియాతో మాట్లాడారు. ‘దాదాపు 50 మంది నాపై దాడి చేశారు, కొట్టారు, తన్నారు. కాంగ్రెస్ నేతలు సభ నుంచి నన్ను బయటకు లాగిపడేశారు. రెడ్ డైరీ వివరాలు సభకు చెప్పాలని అనుకొన్నాను. మాట్లాడేందుకు కూడా స్పీకర్ అవకాశం ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. ‘నేను చేసిన తప్పేంటి?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్న అంశాన్ని ప్రస్తావించానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మంత్రి శాంతికుమార్ ధరివాల్ వద్దకు వెళ్లి, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరాను. అందుకు అనుమతించని స్పీకర్.. చాంబర్కు రావాలని పదేపదే చెప్పారు. అనంతరం మంత్రితో పాటు ఎమ్మెల్యేలు చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. తీవ్రంగా కొట్టారు. డైరీలోని కొన్ని పేజీలను చించుకొని పోయారు’ అని వివరించారు.
జైలుకు పంపుతామంటూ బెదిరింపులు
అసెంబ్లీకి హాజరు కావొద్దని, త్వరలో జైలుకు పంపుతామంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని రాజేంద్ర సింగ్ తెలిపారు. రాజేంద్ర సింగ్ను తొలుత కాంగ్రెస్ ఎమ్మెల్యే రఫీక్ ఖాన్ నెట్టగా.. ఆ తర్వాత ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా చుట్టుముట్టి, రాజేంద్రసింగ్ను బయటకు పంపేందుకు ప్రయత్నించడం అసెంబ్లీ కార్యకలాపాల వీడియోల్లో కనిపించింది. కాగా, సోమవారం ఉదయం అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు రాజేంద్ర సింగ్ ప్రయత్నించగా.. కొంతమంది తెల్లచొక్కాల్లో ఉన్న వ్యక్తులు, ఆయన్ను అడ్డుకొన్న వీడియోను ఏఎన్ఐ వార్తాసంస్థ పోస్టు చేసింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింసపై మాట్లాడినందుకు రాజేంద్రసింగ్ను మంత్రి పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
ఆ రెడ్ డైరీలో ఏముంది?
అసెంబ్లీ ప్రారంభానికి ముందు సోమవారం ఉదయం రాజేంద్రసింగ్ మీడియాతో మాట్లాడుతూ డైరీలో కొన్ని రహస్యాలు ఉన్నాయని, వాటిని సభ ముందు పెడుతానని పేర్కొన్నారు. ఆర్టీడీసీ చైర్మన్ ధర్మేంద్ర రాథోడ్ ఈ డైరీ రాసారని చెప్పారు. గతంలో అయన ఇంటిపై ఐటీ శాఖ దాడులు జరిగిన సమయంలో.. సీఎం అశోక్ గెహ్లాట్ సూచన మేరకు తాను రాథోడ్ ఇంటికి వెళ్లి, ఆ డైరీని దాచి పెట్టానని తెలిపారు. ఇందులో ఎమ్యెల్యేలకు ఎంతెంత డబ్బు ఇచ్చారనే వివరాలు ఉన్నాయని, సీఎం గెహ్లాట్తోపాటు ఆయన కుమారుడు వైభవ్ గెహ్లాట్ పేరు కూడా డైరీలో ఉన్నదని పేర్కొన్నారు. తాను ప్రజల వద్దకు వెళ్తానని, మంగళవారం డైరీ రహస్యాలను బయటపెడుతానని రాజేంద్ర సింగ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.