న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: రాజస్థాన్ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు తీవ్రమైంది. సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలపై గెహ్లాట్ ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదంటూ సచిన్ పైలట్ ప్రశ్నిస్తున్నారు. మహాత్మా జ్యోతిబాపూలే జయంతి పురస్కరించుకొని మంగళవారం షాహీద్ స్మారక్ వద్ద నిరాహార దీక్షను చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ‘మరో ఏడు నెలల్లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి.
గత ప్రభుత్వంపై ప్రతిపక్షంలో ఉండి మేం ఎన్నో ఆరోపణలు చేశాం. అధికారంలోకి వచ్చాక రూ.45 వేల కోట్ల గనుల కుంభకోణంపై విచారణ చేపడతామని వాగ్దానం చేశాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు దాటుతున్నా చర్యలు శూన్యం. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయనే ఆరోపణలకు ఆస్కారం ఏర్పడుతున్నది. అధికారంలోకి వచ్చాక చేతల్లో చూపెట్టడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నాం. గెహ్లాట్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ 24గంటలపాటు నిరాహార దీక్షను చేపట్టబోతున్నా’ అని అన్నారు.