జైపూర్ : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ పోటీ చేస్తారనే వార్తల నడుమ తదుపరి రాజస్ధాన్ సీఎం ఎవరనే అంశంపై వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. గెహ్లోత్ స్ధానంలో కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ సీఎం పగ్గాలు చేపడతారనే ఊహాగానాలు సాగుతున్నాయి. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు కేరళ వచ్చిన సచిన్ పైలట్ ఈ అంశంపై పెదవివిప్పారు.
పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా తాను నిర్వర్తిస్తానని చెప్పారు. అశోక్ గెహ్లోత్ సీనియర్ నేతని, ఆయన దశాబ్ధాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నారని, వచ్చే ఏడాది రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడమే తమ ముందున్న లక్ష్యమని పైలట్ స్పష్టం చేశారు. తదుపరి రాజస్ధాన్ సీఎం ఎవరని ప్రశ్నించగా కాంగ్రెస్ నాయకత్వం తమకు ఏ బాధ్యతలను నిర్ణయించినా దాన్ని ఆమోదిస్తామని పైలట్ పేర్కొన్నారు.
కాగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఇటీవల అశోక్ గెహ్లోత్ సమావేశం కావండంతో కాంగ్రెస్ అధ్యక్ష రేసులో గెహ్లోత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అక్టోబర్ 17న జరిగే అధ్యక్ష ఎన్నిక కోసం గెహ్లోత్ ఇంకా నామినేసన్ దాఖలు చేయలేదు. ఇక గెహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడితే సీఎం పదవి కోసం ఎప్పటి నుంచో ఆయనతో పోటీ పడుతున్న సచిన్ పైలట్క్ కీలక పదవి దక్కనుంది.