న్యూఢిల్లీ: రాజస్థాన్కు చెందిన కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిశారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో వారితో భేటీ అయ్యారు. దీంతో రాజస్థాన్ కేబినెట్ రీషఫుల్పై టాక్ వినిపిస్తున్నది. అక్టోబర్ తొలి వారంలో రాజస్థాన్ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరుగవచ్చని తెలుస్తున్నది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్లో సీఎం మార్పు నేపథ్యంలో రాజస్థాన్లో కూడా సీఎం మార్పు ఉండవచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి.
రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేండ్ల సమయం ఉన్నప్పటికీ పార్టీలో రాజుకున్న అసంతృప్తిని తొలగించి ప్రక్షాళన చేసేందుకు సీఎం మార్పునకు అధిష్ఠానం మొగ్గు చూపవచ్చని తెలుస్తున్నది. ఇటీవల తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్కు కీలక పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఆయనకు కీలకమైన పదవి దక్కవచ్చన్న ప్రచారం జరుగుతున్నది.