జైపూర్: రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు కొనసాగుతున్నది. సీఎం అశోక్ గెహ్లాట్ మరోసారి సచిన్ పైలట్పై మండిపడ్డారు. గురువారం ఎన్డీటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన సచిన్ పైలట్ నమ్మక ద్రోహి అని విమర్శించారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆయనకు బీజేపీ నుంచి రూ.10 కోట్లు అందాయని ఆరోపించారు. అలాంటి ద్రోహి ఎప్పటికీ సీఎం కాలేడని దుయ్యబట్టారు. పది మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా లేని వ్యక్తి పార్టీలో తిరుగుబాటుకు ప్రయత్నించాడని, కాంగ్రెస్కు నమ్మక ద్రోహం చేశాడని ఆరోపించారు. అలాంటి సచిన్ పైలట్ను కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా చేయబోదని అన్నారు. ఆయనను సీఎంగా చేస్తున్నారన్న వదంతుల వల్లనే తన వర్గం ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఎదురుతిరిగినట్లు చెప్పారు.
కాగా, సచిన్ పైలట్కు బీజేపీతో సంబంధాలున్నాయని సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఇద్దరు కేంద్ర మంత్రులైన అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ను ఆయన ఢిల్లీలో కలిశారని తెలిపారు. సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేల్లో కొందరికి రూ.5 కోట్లు, మరికొందరికి రూ.10 కోట్లు ముట్టాయని ఆరోపించారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం నుంచి ఆ డబ్బులు అందాయని, పైలట్ శిబిరాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సందర్శించారని చెప్పారు. ఇదంతా బీజేపీ చేస్తున్నదని, రూ.10 కోట్లు పంపిణీ చేసిందని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. సచిన్ పైలట్ను సీఎంగా చేస్తే రాజస్థాన్ ప్రజలు ఆమోదించరంటూ ఆయనపై తన ఆక్రోశాన్ని మరోసారి వెళ్లగక్కారు.