Sidhu Moosewala Murder Case | సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందుతుడు, గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మేనల్లుడు సచిన్ బిష్ణోయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అజర్బైజాన్ వద్ద పట్టుకున్నట్లు సమాచారం. లారెన్స్ గ్యాంగ్కు సచిన్ బయటి నుంచి సూచనలు ఇచ్చేవాడని ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా.. ముసేవాలా హత్య కేసులో మాన్సా పోలీసులు పోలీసులు చార్జిషీట్ను దాఖలు చేశారు. 1850 పేజీల చార్జిషీట్లో 24 మంది నిందితుల పేర్లు ఉన్నాయి.
ఇందులో ఇప్పటికే 20 మందిని అరెస్టు చేయగా.. మరో నలుగురు నిందితులు విదేశాల్లో తలదాచుకున్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం పంజాబ్ పోలీసుల అదుపులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మూసేవాల హత్యకు సూత్రధారి అని తేలింది. విదేశాల్లో తలదాచుకున్న నిందితుల్లో ప్రధాన నిందితులు గోల్డీ బ్రార్, సచిన్ బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్, లిజిన్ నెహ్రా ఉన్నారు. ఈ కేసులో 34 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఎస్పీ గౌరవ్ తోరా తెలిపారు.