ఫుణె, జూలై 12: వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువ కాలం తాజాగా ఉంచే పరికరాన్ని ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు కనుగొన్నారు. దీని ద్వారా పండ్లు, కూరగాయల జీవితకాలాన్ని మూడు నుంచి 30 రోజుల వరకు పెంచుకోవచ్చు. పంజాబ్లోని భగల్పూర్కు చెందిన ఐఐటీ కాన్పూర్ విద్యార్థి నిక్కి కుమార్ ఝా, తన సోదరి రష్మి ఝాతో కలిసి ‘సబ్జికోఠి’ అనే రిఫ్రిజిరేటర్ను కనిపెట్టారు.
సబ్జికోఠి ఇండ్లలోని రిఫ్రిజిరేటర్ కంటే పది రెట్లు ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రిఫ్రిజిరేటర్ ధరలో సగం ఖరీదుచేసే ఈ ఆవిష్కరణకు రోజుకు ఒక లీటర్ నీరు, 20 వాట్ల విద్యుత్తు అవసరం. ఇటీవల ఫుణెలో నిర్వహించిన షాఫ్లర్ ఇండియా సోషల్ ఇన్నోవేటర్ ఫెల్లోషిప్ కార్యక్రమంలో సబ్జికోఠి పరికరం మొదటి బహుమతిని గెలుచుకొన్నది. రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని నిక్కి ఝా అందుకున్నారు.