తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల ఆలయాన్ని మాస పూజల కోసం శుక్రవారం తెరిచారు. ప్రధాన పూజారి వీకే జయరాజ్ పొట్టి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తాంత్రి కందారు మహేష్ మోహనారు సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో ఆలయాన్ని తెరిచారు. కార్కిదకం మలయాళ మాసం నేపథ్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి ఈ నెల 21 వరకు ఐదు రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా స్లాట్లు నమోదు చేస్తున్న 5000 వేల మంది భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తామని చెప్పింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం 48 గంటలు ముందుగా చేయించుకున్నఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ లేదా కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించిన భక్తులను మాత్రమే ఆలయంలోకి ప్రవేశానికి అనుమతిస్తామని బోర్డు వెల్లడించింది. మరోవైపు నీలక్కల్లో కరోనా పరీక్షలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ గడువు చెల్లిన వారికి కరోనా పరీక్ష చేస్తారు. పాజిటివ్ వచ్చిన వారిని పెరునాడులోని ఐసొలేషన్ కేంద్రానికి తరలిస్తారు.