Uttam Kumar Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు కోతలు లేవని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్కు ఉన్న 39 మంది ఎమ్మెల్యేల్లో 25 మంది కాంగ్రెస్లోకి వస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుదుత్పత్తిని 7 వేల మెగావాట్ల నుంచి 12 వేలకు పెంచామని చెప్పడం అబద్ధమని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజె క్టు మీద ఇప్పటికే రూ.95 వేల కోట్లు ఖర్చు చేశారని, దానిని పూర్తి చేయాలంటే రూ.1.5 లక్షల కోట్లు అవుతుందని తెలిపారు. నిరుడు అక్టోబర్ 21న మేడిగడ్డ కుంగిందని, ఆ తర్వాత నీటిని దిగువకు వదిలారని చెప్పారు. ఇప్పుడు నెపం తమ పై నెడుతున్నారని మండిపడ్డారు. కృష్ణా నదీజలాల విషయంలో 299 టీఎంసీలకు ఒప్పుకొని కేసీఆర్ దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. దీంతో ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలకు నష్టం జరిగిందని తెలిపారు. నదీజలాల్లో వాటాపై తాము ఢిల్లీలో సమర్థంగా వాదిస్తున్నామని చెప్పారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్కు ఇప్పటివరకు నీటి కేటాయింపులు జరగలేదని, తాము కేటాయింపులు చేసి పూర్తి చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బీఎల్ఆర్, బాలునాయక్, జయవీర్రెడ్డి, టీపీసీసీ వరింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు.
లోక్సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీఆర్ఎస్ గెలిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్ విసిరారు. నల్లగొండలో జరిగిన కాంగ్రెస్ సభ లో,మంత్రి ఉత్తమ్తో కలిసి హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 8 నుంచి 10 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందుతుందని టీవీ చానల్ ఇంటర్వ్యూలో చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. కనీసం రెండు గెలిస్తే తాను రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.