కేంద్రం అనుసరిస్తున్న విధి విధానాలపై శివసేన తీవ్రంగా విరుచుకుపడింది. దేశంలోని కొత్త తరం ఏ దిశలో పయనిస్తుందో కేంద్రం పరిశీలిస్తుందా? అంటూ తీవ్రంగా విరుచుకుపడింది. నిరుద్యోగం, కశ్మీర్ అంశం, జ్ఞానవాపీ మసీదు విషయంలో కేంద్రం సరిగ్గా వ్యవహరించడం లేదని, మార్గదర్శనం చేయాల్సిన ప్రధాని మౌనంగా ఉండిపోవడం ఆశ్చర్యంగా ఉందని శివసేన మండిపడింది.
దేశంలో వున్నంత నిరుద్యోగ సమస్య ప్రపంచలో ఎక్కడా లేదని శివసేన మండిపడింది. మోదీ కాలంలో దేశంలోని చాలా పరిశ్రమలు మూతపడ్డాయని, కొత్త పరిశ్రమలు కూడా రాలేదని ఎద్దేవా చేసింది. అసలు కొత్త పరిశ్రమలు రావడానికి భారత్లో అనుకూల వాతావరణమే లేదని పేర్కొంది.అయితే… తన అభిమాన పారిశ్రామిక వేత్తలకు మాత్రం కేంద్రం సకల సౌకర్యాలు కల్పిస్తోందని ఆరోపించింది. ఈ పరిణామాలను అభివృద్ధి అనాలా? అంటూ శివసేన ప్రశ్నించింది.
హిందువులు, ముస్లింలు అన్న తేడా లేకుండా కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు విజృంభిస్తున్నారని, దేశం పక్షం తీసుకున్న వారిని అంత మొందించడమే లక్ష్యంగా ఉగ్రదాడులు సాగుతున్నాయని శివసేన అభిప్రాయపడింది. గత రెండు నెలల్లోనే కశ్మీర్ లోయలో 12 మంది ముస్లిం పోలీసులను ఉగ్రవాదులు చంపేశారని పేర్కొంది. అయినా.. బీజేపీ మాత్రం ఒకరి పక్షమే వహిస్తూ… మాట్లాడుతోందని మండిపడింది. ఇది జాతి ఐక్యత అవుతుందా? అంటూ శివసేన సామ్నా వేదికగా కేంద్రాన్ని నిలదీసింది.