న్యూఢిల్లీ : ఐఎఫ్ఎస్ అధికారులను అహంకారులుగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ తోసిపుచ్చారు. ఐఎఫ్ఎస్ అధికారులది అహంకారం కాదని, ప్రపంచ వేదికపై భారత్ సాధించిన విశ్వాసానికి ప్రతీకని మంత్రి స్పష్టం చేశారు.
లండన్లో ఐడియాస్ ఫర్ ఇండియా కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత విదేశీ సర్వీసులకు చెందిన అధికారులు పూర్తిగా మారిపోయారని, వారు అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఎవరేం చెప్పినా వినడం లేదని ఇటీవల యూరప్ అధికారులు తనతో అన్నారని రాహుల్ పేర్కొన్నారు. ఇప్పుడు వారు ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల గురించే చెబుతున్నారని అన్నారు.
రాహుల్ వ్యాఖ్యలపై జైశంకర్ స్పందిస్తూ అవును వారు (ఐఎఫ్ఎస్) ఇప్పుడు పూర్తిగా మారిపోయారని, ప్రభుత్వ ఉత్తర్వులను వారు పాటిస్తారని..ఇతరుల వాదనలకు దీటుగా బదులిస్తారని ట్వీట్ చేశారు. దీన్ని అహంకారం అనరని, ఇది వారికున్న విశ్వాసమని చెప్పారు. వారి విశ్వాసాన్ని జాతి ప్రయోజనాలను కాపాడటం అంటారని రాహుల్కు చురకలు వేశారు.