Vladimir Putin : రష్యాలోని కజాన్లో బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సమావేశాలు కొనసాగుతున్నాయి. సదస్సు రెండోరోజు ప్లీనరీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సదస్సులో తొలుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. బ్రిక్స్ కూటమిలో చేరడానికి 30 దేశాలు ఆసక్తిగా ఉన్నాయని చెప్పారు. అయితే కూటమి విస్తరణ కోసం ఎవరినిపడితే వారిని చేర్చుకోదల్చుకోలేదని, సమర్థంగా పని చేయడాన్ని దృష్టిలో పెట్టుకొనే గ్రూపు విస్తరణపై చర్చిస్తామని తెలిపారు.
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధినేత జీ జిన్పింగ్, ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తదితర ప్రపంచ నేతలు ఆ వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం బ్రిక్స్ ఫ్యామిలీ అంతా కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఫ్యామిలీ ఫొటో సెషన్ సందర్భంగా మోదీ, యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్ కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.
బ్రిక్స్ రెండో రోజు ప్లీనరీ అనంతరం ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ కానున్నారు. వీరిద్దరూ ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు భారత విదేశాంగ వర్గాలు తెలిపాయి. దాదాపు ఐదేళ్ల తర్వాత తొలిసారిగా ఈ ఇద్దరు నేతలు భేటీ కానుండటం గమనార్హం. ఈ విషయాన్ని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ధ్రువీకరించారు.
సరిహద్దు గస్తీకి సంబంధించి భారత్-చైనాల మధ్య కీలక ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఇరు దేశాల అధినేతల భేటీ కానుండటం గమనార్హం. ఇదిలావుంటే ప్రధాని మోదీ ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యారు. మంగళవారం పుతిన్తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. జిన్పింగ్తో భేటీ అనంతరం మరికొందరు నేతలతో కూడా మోదీ సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.