న్యూఢిల్లీ, డిసెంబర్ 3: రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం భారత్కు చేరుకోనున్నారు. పర్యటన సందర్భంగా వాణిజ్య, ఆరోగ్య, వ్యవసాయ, మీడియా, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాలలో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం 25వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య 23వ ద్వైపాక్షిక సదస్సు జరగనుండడం విశేషం.
ఉక్రెయిన్పై 2022లో రష్యా ప్రత్యేక సైనిక చర్యను ప్రారంభించిన తర్వాత పుతిన్ భారత్ను సందర్శించడం ఇదే మొదటిసారి. గురువారం సాయంత్రం పుతిన్ ఢిల్లీ చేరుకుంటారు. అనంతరం ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసంలో విందు ఇవ్వనున్నారు. మరుసటి రోజు శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్ వద్ద సంప్రదాయ స్వాగతంతో పుతిన్ భారత పర్యటన అధికారికంగా ప్రారంభమవుతుంది.