న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) వచ్చే నెలలో భారత్కు రానున్నారు. వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా డిసెంబర్ మొదటి వారంలో పుతిన్ ఢిల్లీకి చేరుకోనున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా డిసెంబర్ 6న ప్రధాని మోదీతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత రష్యా అధ్యక్షుడికి (Russian President) ఇది రెండో విదేశీ పర్యటన కావడం విశేషం. ఇంతకుముందు ఆయన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో జెనీవాలో సమావేశమయ్యారు. అనంతరం ఇటలీలో జరిగిన జీ 20 సదస్సులో వర్చువల్గా పాల్గొన్నారు.
కాగా, పుతిన్ చివరిసారిగా 2018లో భారత్లో పర్యటించారు. అప్పుడు 400 డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలను భారత్, రష్యా కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది చివరికి ఎయిర్ ఢిఫెన్స్ సిస్టమ్స్కు చెందిన పరికరాల్లో మొదటి బ్యాచ్ భారత్కు చేరనున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాధినేతలు మరోమారు సమావేశమవుతుండటం విశేషం. గతేడాది జరగాల్సిన శిఖరాగ్ర సదస్సు కరోనా నేపథ్యంలో రద్దయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య 20 వార్షిక శిఖరాగ్ర సదస్సులు జరిగాయి.