(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ‘వడ్డించే వాడు మనవాడైతే… వెనక బంతిలో కూర్చున్నా ఫర్వాలేదు’ అన్న సామెతను నిజం చేస్తున్నది బీజేపీ సర్కారు. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని ఒకవైపు సామాన్యులు గగ్గోలు పెడుతున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఈ విషయం చెవికెక్కటం లేదు. సరికదా..సగటు జీవి కంటే ప్రైవేటు రిఫైనరీలే ముద్దంటూ దౌత్య సంబంధాల చాటున కోట్లు దోచిపెట్ట్టే చర్యలు ఉపక్రమించింది.
రష్యా నుంచి చౌక ధరకే క్రూడాయిల్ను దిగుమతి చేసుకొని ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలకు కేటాయించకుండా..కేవలం ప్రైవేట్ సంస్థలకు అత్యధిక ఇంధనాన్ని కట్టబెడుతున్నదని విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే చమురు కంటే రష్యా చమురు తక్కువ ధరకు లభిస్తుండటంతో అత్యధిక భాగం ఇక్కడి నుంచే కొనుగోలు చేస్తున్నది. తక్కువ ధర వల్ల వచ్చే ప్రయోజనాన్ని సామాన్యుడికి పంచకుండా కేవలం కార్పొరేట్ సంస్థల జేబులు నింపుతున్నది. గత ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు రష్యా నుంచి భారత్ రూ.1.6 లక్షల కోట్ల విలువైన క్రూడాయిల్ను దిగుమతి చేసుకున్నది. గడిచిన పదేండ్లలో ఇంతటి స్థాయిలో దిగుమతి చేసుకోవడం ఇదే తొలిసారి. యుద్ధంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కున్న రష్యాకు స్నేహ హస్తం అందించడం..మరోవైపు ఇది తన ప్రియమిత్రులకు దోచి పెట్టడానికి మోదీ వేసిన ఎత్తుగడ వడం విశేషం.
కార్పొరేట్ సంస్థలే ముద్దు
పాశ్చాత్య దేశాలు రష్యాను పూర్తిగా ఆర్ధికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ..భారత్ మాత్రం దౌత్య సంబంధాలపేరిట ఓ అడుగు ముందుకేసి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నది. ఆ దేశానికి వచ్చే ఆదాయంలో సగం క్రూడాయిల్ను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వల్లే వస్తున్నది. కానీ, కొన్ని దేశాలు రష్యా క్రూడాయిల్పై నిషేధం విధించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చౌక ధరకు భారత్కు క్రూడాయిల్ విక్రయిస్తున్నది. తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఈ క్రూడాయిల్ను నామ మాత్రపు ధరకు రిలయన్స్కు కట్టబెడుతున్నది. తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఈ చమురును ఎక్కువ ధరకు యూరప్ దేశాలకు ఎగుమతి చేసి వేల కోట్లు గడిస్తున్నది. కానీ, ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియంలకు అతి తక్కువ శాతం కేటాయిస్తూ వాటి గొంతు కోస్తున్నది మోదీ సర్కార్.