చండీఘఢ్ : మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రదాన కార్యాలయాన్ని గ్రనేడ్ ఢీకొన్న ఘటన కలకలం రేపుతోంది. పేలుడు జరిగిన ఇంటెలిజెన్స్ బ్యూరో భవనానికి కేవలం కిలోమీటర్ దూరంలో రష్యన్ రాకెట్ లాంఛర్ను స్వాధీనం చేసుకున్నారు. రష్యా తయారీ ఆర్పీజీ 22గా దీన్ని గుర్తించారు.
సోమవారం రాత్రి పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం ప్రదాన కార్యాలయంపై జరిగిన గ్రనేడ్ దాడిలో పేలుడు దాటికి భవనం అద్దాలు ధ్వంసం కావడంతో పాటు ఫాల్స్ సీలింగ్లో కొంత భాగం కుప్పకూలింది. ఈ ఘటనలో ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో పాటు ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
పేలుడు సమాచారం అందుకోగానే సీనియర్ పోలీస్ అధికారులు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారని మొహాలీ పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు సాగుతోందని తెలిపారు. ఇద్దరు అనుమానితులు కారులో ఘటనా ప్రాంతానికి చేరుకుని ఇంటెలిజెన్స్ కార్యాలయ భవనంపై గ్రనేడ్ దాడికి పాల్పడ్డారని అధికారులు చెబుతున్నారు.