Russia S-400 : రష్యాకు చెందిన ఎస్400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ త్వరలో ఇండియాకు రానున్నాయి. ఇవి ఐదో దశ డిఫెన్స్ సిస్టమ్స్. ఇప్పటికే నాలుగోదశ ఎస్400 క్షిపణులు ఇండియాకు చేరాయి. వీటిని ఇండియా గతంలోనే ఉపయోగించింది కూడా. గత ఏడాది పాకిస్తాన్పై ఇండియా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దాడి సమయంలో భారత వాయుసేన.. ఎస్400 డిఫెన్స్ సిస్టమ్స్ ను ఉపయోగించింది. ఇప్పుడు ఎస్400 ఐదో దశలో ఇండియాకు అందించేందుకు రష్యా సిద్ధమైంది.
వచ్చే నవంబర్ నెలలోనే ఇవి ఇండియాకు రానున్నట్లు సమాచారం. వచ్చే నెల మధ్యలో నాలుగో ఎస్ 400 క్షిపణి విధ్వంసక వ్యవస్థలు ఇండియన్ పోర్టుకు చేరుకుంటాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇండియా–రష్యాల మధ్య ఉన్న సైనిక సహకారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్షిపణులు 400 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉన్నాయి. మరోవైపు కొత్తగా ఇంకో ఐదు ఎస్ 400 సిస్టమ్స్ కొనేందుకు కేంద్రం అంగీకరించింది. 400 కిలోమీటర్ల పరిధిలో భారత గగనతలంపైకి దూసుకొచ్చే క్షిపణుల్ని, విమానాల్ని ఇవి ధ్వంసం చేస్తాయి. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి సింధు నది ప్రాంతం నుంచి వచ్చే గగనతల దాడుల్ని ఇవి అడ్డుకుంటాయి.
ఇప్పటికే భారత రక్షణ రంగ అధికారులు రష్యా సందర్శించి ఎస్400 సిస్టమ్స్ తనిఖీ చేశారు. కొత్తగా వచ్చే క్షిపణి విధ్వంసక వ్యవస్థను రాజస్థాన్లో ఏర్పాటు చేయబోతున్నారు. గతంలో ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎస్ 400 క్షిపణి విధ్వంసక వ్యవస్థను ధ్వంసం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. పంజాబ్, గుజరాత్లోని ఎస్400 డిఫెన్స్ సిస్టమ్స్ పై దాడికి విఫలయత్నం చేసింది. ఈ సిస్టమ్స్ వల్ల పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలు సురక్షితం కాదని ఆ దేశం భావించింది. దీంతో స్థావరాల్ని మార్చేసినట్లు సమాచారం.