న్యూఢిల్లీ: భారత్కు ఎస్-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థల సరఫరాను రష్యా ప్రారంభించింది. రష్యన్ ఫెడరల్ సర్వీసెస్ మిలిటరీ-టెక్నికల్ కోఆపరేషన్ (FSMTC) డైరెక్టర్ డిమిత్రి షుగేవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం వీటి సరఫరా జరుగుతున్నదని తెలిపారు. దుబాయ్ ఎయిర్ షోకు ముందు ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. FSMTC అనేది రష్యా ప్రభుత్వానికి చెందిన ప్రధాన రక్షణ ఎగుమతి నియంత్రణ సంస్థ.
శత్రు యుద్ధ విమానాలు, సుదూర శ్రేణి క్రూయిజ్ క్షిపణులను ఎస్-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ నాశనం చేస్తుంది. అత్యాధునిక ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థల ఐదు యూనిట్లను సుమారు రూ.35,000 కోట్లతో కొనుగోలు చేసేందుకు రష్యాతో భారత్ 2018లో ఒప్పందం కుదుర్చుకున్నది.
ఈ నేపథ్యంలో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్క్వాడ్రన్లోని మొదటి భాగాలు ఇప్పటికే భారత్కు చేరుకోవడం ప్రారంభించాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. క్షిపణి వ్యవస్థల భాగాలు వాయు, సముద్ర మార్గాల ద్వారా వస్తున్నాయని చెప్పారు. వీటిలో మొదటి యూనిట్ వెస్ట్రన్ ఫ్రంట్కు సమీపంలో మోహరించరించనున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్, చైనా గగనతలం నుండి ముప్పు ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను ఏర్పాటు చేస్తారని పేర్కొన్నాయి.
కాగా, ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొదటి స్క్వాడ్రన్ డెలివరీ ఈ ఏడాది చివరికి పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అనంతరం విస్తరణలో భాగంగా భారత వైమానిక దళం తూర్పు వైపు దృష్టి సారిస్తుందని చెప్పారు. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్పై దేశంలోనే శిక్షణ ఇవ్వడానికి కొన్ని వనరులతోపాటు సిబ్బందిని కూడా ఐఏఎఫ్ కేటాయించిదన్నారు.