Manipur | మైతీ తెగకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ (ఏటీఎస్యూఎమ్) మణిపూర్ (Manipur)లో చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. దీంతో ఆ రాష్ట్రం అల్లర్లతో అట్టుడుకుతోంది. హింసలో గ్రామాలకు గ్రామాలు తగలబడిపోయాయి. ఈ అల్లర్లలో సుమారు వంద మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పలువురు నిరాశ్రయులయ్యారు. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ నుంచి ప్రజలు ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
మే 3 నుంచి జాతి ఉద్రిక్తతల (ethnic clashes)తో దెబ్బతిన్న మణిపూర్ నుంచి వలసపోయే వారి సంఖ్య భారీగా పెరిగింది. రాష్ట్రం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిపోతుండటంతో విమాన ఛార్జీలకు రెక్కలొచ్చాయి. ప్రయాణికుల డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో ఇండిగో (IndiaGo), ఎయిర్ ఏషియా ( AirAsia) సహా పలు విమానయాన సంస్థలు తమ ఛార్జీలను భారీగా పెంచేశాయి. ముఖ్యంగా ఇంఫాల్-కోల్కతా ( Imphal-Kolkata ), ఇంఫాల్-గువాహటి (Imphal – Guwahati) మార్గాల్లో విమాన టిక్కెట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. వన్వే కింద ఒక్కొక్కరికి రూ.2,500 ఉన్న విమాన టిక్కెట్టు ధర అమాంతం పెరిగి రూ.25,000కు చేరింది.
సాధారణ రోజుల్లో ఇంఫాల్-కోల్కతా ( Imphal-Kolkata ) మధ్య విమాన ఛార్జీ వన్ వేలో ప్రయాణించే వ్యక్తికి రూ. 2,500 నుంచి రూ. 5,000 వరకు ఉండేది. ఇంఫాల్-గువాహటి (Imphal – Guwahati) వెళ్లే విమానానికి కూడా ఇదే ఛార్జీ వర్తిస్తుంది. అయితే రాష్ట్రంలో హింస చెలరేగినప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. విమాన ధరలు ఆకాశాన్నంటాయి. ఇంఫాల్- కోల్కతా మార్గంలో వన్వే ప్రయాణానికి రూ.12,000 నుంచి రూ.25,000 వరకు ధర పెరిగింది. అదే సమయంలో ఇంఫాల్- గువాహటి వెళ్లేందుకు వన్వే టికెట్ ధర రూ.15,000కి పెరిగింది.
మరోవైపు, ఈశాన్య రాష్ట్రం మణిపూర్ క్రమేపీ సాధారణ పరిస్థితికి చేరుకుంటోంది. ఓ వైపు సైన్యం సున్నిత ప్రాంతాల్లో పహారా కాస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో డ్రోన్లు, హెలికాప్టర్లతో నిఘా పెట్టింది. పరిస్థితి కొంత మేరకు సద్దు మణగడంతో ఆదివారం మణిపూర్లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫూను సడలించారు. దీంతో అవసరమైన వస్తువులు కూరగాయలు, మందులు వంటివి కొనుగోలు చేసేందుకు ప్రజలు రోడ్లపైకి వచ్చారు.
గత కొద్ది రోజులుగా తీవ్ర హింసాత్మక ఘటనలతో రగిలిపోయిన మణిపూర్లో ఆదివారం కొంతమేర ప్రశాంత వాతావరణం కనిపించిందని అధికారులు తెలిపారు.
మణిపూర్లో చిక్కుకున్న తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల విద్యార్థులు సురక్షితంగా స్వదేశాలకు తరలిపోతున్నారు. తమ రాష్ట్ర విద్యార్థులు, ప్రజల్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విమానాల ద్వారా తరలిస్తున్నారు. మణిపూర్లో అల్లర్ల నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక విమానం ద్వారా అక్కడ చిక్కుకున్న వారిని తరలిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మణిపూర్ రాజధాని ఇంఫాల్(Imphal) మీదుగా బయలు దేరిన విమానం మధ్యాహం రెండు గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు (Shamshabad Airport) చేరుకుంది. తెలంగాణ భవన్ అధికారులు మొదటి విడతగా 106 మంది విద్యార్థులను హైదరాబాద్(Hyderabad)కు తీసుకువచ్చారు. దీంతో పాటుగా ఏపీ(AP))కి చెందిన 108మంది విద్యార్థులకు కూడా మరో విమానంలో శంషాబాద్కు చేరుకున్నారు.
Also Read..
Rishi Sunak | కింగ్ చార్లెస్ పట్టాభిషేకం.. భారీ విందు ఏర్పాటు చేసిన బ్రిటన్ ప్రధాని
Parineeti Chopra | త్వరలో ఎంపీతో నటి పెళ్లి.. మరోసారి డిన్నర్ డేట్కు వెళ్లిన పరిణీతి
Golden Temple | స్వర్ణదేవాలయం సమీపంలో మరో పేలుడు.. 24 గంటల్లో రెండోది