హుబ్బళి, మార్చి 20: పోస్టాఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తే రూ. 3 వేలు జమ అవుతాయని, ఇది మోదీ ప్రభుత్వ గ్యారెంటీ అని కర్ణాటకలోని హుబ్బళిలో వదంతులు వ్యాపించడంతో సమీపంలోని పోస్టాఫీసులకు మహిళలు పోటెత్తారు. ఇది నిజం కాదని ఎంత చెప్పినా జనం వినే పరిస్థితి కనిపించ లేదు. మంగళవారం రాత్రి 8 గంటల వరకూ పోస్టాఫీసుల దగ్గర జనం పడిగాపులు కాచారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ తరచూ మోదీ గ్యారెంటీ అని ప్రచారం చేస్తున్నారు. దీంతో కొంత మంది మోదీ గ్యారెంటీ కింద డబ్బులు వస్తాయని తప్పుడు సమాచారాన్ని ప్రచారంలో పెట్టారు. పోస్టాఫీస్లో బీపీఎల్ కార్డు ఉన్న మహిళలు అకౌంట్ ఓపెన్ చేస్తే వారి ఖాతాలో ప్రతి మూడు నెలలకు రూ.3 వేలు జమ అవుతాయని పుకారు పుట్టించారు. దీన్ని నమ్మిన జనం ఉదయం నుంచే పోస్టాఫీసుల వద్ద భారీ సంఖ్యలో గుమిగూడారు. వారికి నచ్చచెప్పలేక పోస్టల్ అధికారులు నానా అవస్థలు పడ్డారు.