హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై నెలలో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టులో పూర్తి కానున్నది. ఇద్దరి పదవీకాలం ముగియడానికి ముందే కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి. రాజ్యాంగపరంగా అత్యున్నత స్థానాలైన ఈ రెండు పదవులకు జరగబోయే ఎన్నికలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నిక అధికార ఎన్డీయే కూటమికి, వ్యతిరేక పక్షాలకు మధ్య బలపరీక్షగా మారే అవకాశం ఉన్నది. ఉపరాష్ట్రపతిగా తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కేంద్రంలోని ఎన్డీయేకు ఏం ఇబ్బంది ఉండకపోవచ్చు. లోక్సభ, రాజ్యసభలో పార్టీకి తగినంత సంఖ్యాబలం ఉంది. కానీ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవడం మాత్రం అంత సులభం కాదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములు కావడమే ఇందుకు కారణం.
రాష్ట్రపతిని ప్రత్యేక ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకొంటుంది. ఇందులో లోక్సభ, రాజ్యసభకు ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లకు వేర్వేరు విలువ ఉంటుంది. ఒక రాష్ర్టానికి, మరో రాష్ర్టానికి చెందిన ఎమ్మెల్యేల మధ్య ఓటు విలువలోనూ తేడాలుంటాయి. ఆయా రాష్ర్టాల జనాభా, ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఓటు విలువ మారుతుంది. సాధారణంగా రాష్ట్ర జనాభా ఎక్కువ ఉంటే ఓటు విలువ ఎక్కువగా ఉంటుంది. పార్లమెంటు ఉభయ సభల ఎంపీల ఓటు విలువ సమానంగా ప్రస్తుతం 708గా ఉంది. ఎలక్టోరల్ కాలేజీ వేసిన ఓట్ల మొత్తం విలువ లెక్కగట్టి ఎవరికి ఎక్కువ వస్తే ఆ అభ్యర్థిని గెలిచినట్టుగా ప్రకటిస్తారు.
ప్రస్తుతం రాష్ర్టాల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కలిగి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలకు కలిపి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒక్కటై ఉమ్మడి వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే గెలిచే అవకాశం ఉంది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీజేపీకి రాష్ట్రపతి ఎన్నికకు తగినంత సంఖ్యా బలం ఉంది. కానీ ఈ ఎన్నికల్లో ఓవరాల్గా బీజేపీ వందకు పైగా సీట్లను కోల్పోవడంతో ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది. ఒక్క యూపీలోనే 80 మంది ఎమ్మెల్యేలు తగ్గడంతో ఓటు విలువ పరంగా బీజేపీ ఇక్కడ చాలా నష్టపోయింది.
ఢిల్లీ, పంజాబ్లో అధికారంలో ఉన్న ఆప్తో పాటు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, మహారాష్ట్రలో శివసేన, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలు బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలు. ఈ పార్టీలు యూపీఏ ప్రతిపాదించే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తాయా? లేక ఈ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించుతాయా? అనేది తేలా ల్సి ఉంది. అదే జరిగితే రాష్ట్రపతి ఎన్నికలు రసకందాయంలో పడతాయి. రాష్ట్రపతి ఎన్నికలో ఓట్ల లెక్కింపు సాధారణ ఓట్ల లెక్కింపులా ఉండదు. ప్రత్యక్ష ఓటు బదిలీ పద్ధతి ఉంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇచ్చే ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి అభ్యర్థుల గెలుపోటములు మారతాయి.
ఎన్డీయే అభ్యర్థి నేరుగా విజయం సాధించాలంటే దానికి మరో రెండు ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ, ఒడిశాలోని బిజూ జనతాదళ్ పార్టీల మద్దతు కీలకం కానున్నది. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు బీజేపీకి మద్దతిచ్చాయి. వీటితో పాటు టీఆర్ఎస్ కూడా అప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతిచ్చింది. కానీ వివాదాస్పద సాగు చట్టాలు, కేంద్రం రైతు వ్యతిరేక చర్యలు, సమాఖ్య స్ఫూర్తిని బీజేపీ దెబ్బ తీస్తుండటంతో బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల్లో టీఆర్ఎస్ బలంగా ఉందని రాజకీయ విశ్లేషకులు లెక్కగడుతున్నారు.