తమిళనాడు గవర్నర్కు డీఎంకే కౌంటర్
చెన్నై, మార్చి 15: ఫెడరలిజంపై తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు అధికార డీఎంకే కౌంటర్ ఇచ్చింది. ‘రాష్ట్ర స్వయంప్రతిపత్తి’ అంటే వేర్పాటువాదం అని అర్థం కాదని స్పష్టంచేసింది. ఫెడరలిజంపై ఆయన భయపడాల్సిన అవసరం లేదని ఆ పార్టీ అధికార పత్రిక మురసోలి మంగళవారం సంపాదకీయంలో పేర్కొన్నది. ఇటీవల ఓ కార్యక్రమంలో గవర్నర్ రవి పరోక్షంగా డీఎంకే పార్టీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఫెడరలిజం, భారత సమాఖ్య గురించి మాట్లాడే వారు భారతదేశం 1947 తర్వాతనే పుట్టలేదన్న విషయంతో పాటు మన దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా(యూఎస్ఏ) వంటి కాంట్రాక్టు యూనియన్ కాదనే విషయం గుర్తుంచుకోవాలని, యుగయుగాల నుంచి భారత్ అంటే ఒకటే అని అన్నారు.