కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ఉప ఎన్నికల ప్రచారం తుది దశకు చేరడంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ప్రచారం చివరి రోజైన సోమవారం అధికార టీఎంసీ, బీజేపీ మధ్య రచ్చ జరిగింది. బీజేపీ నేత దిలీప్ ఘోష్ ప్రచారాన్ని టీఎంసీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట, కోట్లాట, ఘర్షణ జరిగింది.
ఈ నేపథ్యంలో దిలీప్ ఘోష్ భద్రతా సిబ్బందిని టీఎంసీ కార్యకర్తలు నెట్టి వేశారు. ఈ సందర్భంగా ఘోష్ భద్రతా సిబ్బంది తుపాకులు తీసి టీఎంసీ కార్యకర్తలను బెదిరించేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఘోష్ తన ప్రచారాన్ని మధ్యలోనే ముగించి వెళ్లిపోయారు. టీఎంసీ కార్యకర్తలు తనపై దాడి చేశారని, కొట్టడంతోపాటు పంచ్లు ఇచ్చారని అనంతరం దిలీప్ ఘోష్ ఆరోపించారు. తాము ప్రచారం నిర్వహించే పరిస్థితి భవానీపూర్లో లేదన్న ఆయన ఈ నెల 30న జరిగే ఉప ఎన్నికను వాయిదా వేయాలని ఈసీని డిమాండ్ చేశారు.
మరోవైపు దిలీప్ ఘోష్, ఇతర బీజేపీ నేతలు స్థానికుల ఇండ్లకు వెళ్లి తమ పార్టీకి ఓటు వేయాలని బెదిరింపులకు పాల్పడ్డారని, ఈ నేపథ్యంలో స్థానికులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారని టీఎంసీ నేత మదన్ మిత్ర స్థానిక మీడియాకు వెల్లడించారు.