న్యూఢిల్లీ: కరోనా అలజడి మళ్లీ మొదలైంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ దేశాలకు చెందిన ప్రయాణికులు ఎవరైనా కోవిడ్ లక్షణాలతో ఉన్నా.. లేక పరీక్షలో పాజిటివ్గా తేలినా.. వాళ్లు క్వారెంటైన్లో ఉండాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ తెలిపారు.
గత కొన్ని రోజుల నుంచి చైనాలో కరోనా కేసులు మళ్లీ కలవరం రేపుతున్నాయి. భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం జాగ్రత్త చర్యలు చేపట్టింది. బీఎఫ్-7 వేరియంట్ కేసులు పలు దేశాల్లో నమోదు అవుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ముక్కు టీకాకు ఓకే చెప్పేసింది. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన బీబీవీ154 ఇంట్రానాసల్ టీకాను ఇవాళ్టి నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో వేయనున్నారు.