హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై ఆరెస్సెస్ అధికార పత్రిక ‘పాంచజన్య’ అక్కసు వెళ్లగక్కింది. ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పురస్కరించుకుని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ‘ఇండియా-ది మోదీ క్వశ్చన్ డాక్యుమెంటరీని సాధనంగా ఉపయోగించుకుంటున్నారు’ అని సంపాదకీయంలో పేర్కొన్నారు. మానవ హక్కుల పేరుతో డాక్యుమెంటరీని దేశంలో పూర్తిగా నిషేధించాలని హిందూసేన అధినేత విష్ణుగుప్తా వేసిన కేసును సుప్రీంకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15న వెలువడిన పాంచజన్య తాజా సంచికలో ఎడిటర్ హితేశ్ శంకర్ భారత్ కో సమఝ్నే కీ ఆవశ్యక్ షర్త్ శీర్షికన రాసిన సంపాదకీయంలో సుప్రీంకోర్టు భారత వ్యతిరేక శక్తులకు ఒక సాధనంగా మారుతున్నదని హద్దుమీరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
భారత్ను వ్యతిరేకిస్తున్న కొన్ని శక్తులు ..సుప్రీంకోర్టును తమ స్వప్రయోజనాలకోసం ఓ పనిముట్టుగా వినియోగించుకుంటున్నాయని ఆరోపించారు. దేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి ఏర్పాటైన సుప్రీంకోర్టును ఇలా ఉపయోగించుకోవడం హేయమని తెలిపారు. ‘అవాస్తవికాలు, ఊహాజనితాలను ఆధారంగా చేసుకుని బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించారు. ఇండియా ప్రతిష్టను దెబ్బ తీయడానికి తీశారు’ అని విమర్శించారు. సర్వోన్నత న్యాయస్థానాన్ని తప్పుబట్టడంపై పలువురు న్యాయకోవిదులు తప్పుబడుతున్నారు. రాజ్యాంగానికి రక్షణ కుట్డం లాంటి సుప్రీంకోర్టుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అభిప్రాయ పడ్డారు.
‘సుప్రీంకోర్టు భారత దేశానికి చెందినది. భారతీయులు చెల్లించే పన్నుల ద్వారా నడుస్తున్నది. ఈ దేశ ప్రయోజనాలకోసం రూపొందించిన చట్టాలు, శాసనాల ప్రకారం అత్యున్నత న్యాయస్థానం తన బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటుంది. కానీ దీన్ని భారత వ్యతిరేక శక్తులు తమకు అనుకూల దులకు దేశంలో రక్షణ కల్పిస్తున్నారని అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణ పేరిట భారత అభివృధ్ధిని అడ్డుకోవడం మొదలుకుని దేశరక్షణ వరకు ఎన్నో అడ్డంకులు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి భారత వ్యతిరేక శక్తులకు ఈ దేశానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసేందుకు, మత మార్పిడులతో దేశాన్ని నిర్వీర్యం చేసేందుకు కూడా హక్కులు కావాలంటున్నారని దుయ్యబట్టారు. భారత్లోని చట్టాలను వాడుకుని లబ్ది పొందాలని చూస్తున్నారని అభిప్రాయ పడ్డారు.
2002లో గుజరాత్ అల్లర్లలో ప్రస్తుత ప్రధాని, అప్పటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీ పాత్రపై ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్ధ బీబీసీ ఇటీవల రెండు భాగాల డాక్యుమెంటరీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ డాక్యుమెంటరీని జనవరి 21న కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ (2021) కింద అత్యవసర అధికారాలను ఉపయోగించి సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్, ట్విట్టర్లలో నిషేధించింది. అయినా ఈ డాక్యుమెంటరీలను ఢిల్లీలోని జేఎన్యూతో పాటు రాజస్థాన్, కేరళలోని పలుప్రాంతాల్లో ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఆ డాక్యుమెంటరీలను భారతదేశంలో పూర్తిగా నిషేధించాలని కోర్టులో కేసు వేస్తే దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)