నాగపూర్, అక్టోబర్ 5: జనాభా విస్పోటం వల్లే మతపరమైన సమతుల్యత దెబ్బతిన్నదని, దీన్ని తగ్గించేందుకు జనాభా నియంత్రణ విధానాన్ని తీసుకురావాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మహారాష్ట్రలోని నాగపూర్లో ఆరెస్సెస్ విజయ దశమి వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విమెన్ మౌంటెనీర్, పద్మశ్రీ సంతోష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భగవత్ మాట్లాడుతూ.. దేశంలో అన్ని వర్గాలకు వర్తించేలా ఒక సమగ్ర జనాభా నియంత్రణ విధానం ఉండాలని చెప్పారు. పలు కఠిన నిర్ణయాలు తీసుకొంటేనే జనాభా సమతుల్యత ఏర్పడుతుందని తెలిపారు. దేశంలో మైనారిటీలకు ప్రమాదం లేనే లేదని అన్నారు. మనుషుల మధ్య శత్రుత్వాన్ని పెంచే వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని వెల్లడించారు. ‘హిందూ రాష్ట్రం’ అంశాన్ని ప్రధానంగా పరిశీలిస్తున్నామని అన్నారు. దీనిపై ఇటీవల ఎక్కువగా చర్చ జరుగుతున్నదని వివరించారు.