Ishan Kishan : ఇటీవలి కాలంలో టీ20ల్లో వరుసగా రాణిస్తున్న ఇషాన్ కిషన్ అరుదైన ఘనత దక్కించుకున్నాడు. అంతర్జాతీయ టీ20లలో నెంబర్ 1 బ్యాటర్గా నిలిచాడు. టీ20 ఇంటర్నేషనల్ టోర్నీలకు సంబంధించి బుధవారం ఐసీసీ ర్యాంకులు విడుదల చేసింది. ఈ ర్యాంకుల్లో బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ నెంబర్ 1 ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ స్థానంలో కొనసాగిన ఇండియన్ ప్లేయర్ అభిషేక్ శర్మను ఇషాన్ వెనక్కి నెట్టాడు. దీంతో దాదాపు ఏడాదిపాటు నెంబర్ 1 ర్యాంకులో కొనసాగిన అభిషేక్ శర్మ ఇప్పుడు రెండో ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు.
పాయింట్ల టేబుల్లో ఇషాన్ కిషన్ 876 పాయింట్లు సాధించగా, అభిషేక్ శర్మ 869 పాయింట్లు సాధించాడు. ఇషాన్.. ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్లో సత్తా చాటాడు. 9 మ్యాచుల్లో 317 పరుగులు సాధించి ఇండియా కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. సంజూ శాంసన్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించాడు. ఇషాన్ సాధించిన విజయం అమోఘం. అతడు అంతకుముందు వరుసగా విఫలమవుతుండటంతో 2023 డిసెంబర్లో జాతీయ జట్టులో స్థానం కోల్పోయాడు. తర్వాత దేశీయ టోర్నీలలో సత్తా చాటాడు. ముఖ్యంగా ఝార్ఖండ్ తరఫున రంజీలలో ఆడి భారీ పరుగులు సాధించాడు.
అనంతరం 2025-26లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా రాణించాడు. దీంతో తిరిగి జాతీయ జట్టులో అతడికి స్థానం దక్కింది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్లో కూడా రాణించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు ఇటీవల ఇండియాపై రెండు టీ20 మ్యాచుల్లో విజయం సాధించిన ఐర్లాండ్ ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్లో దూసుకెళ్లారు. ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ 77వ ర్యాంకు సాధించాడు. రాస్ అడైర్ 84వ ర్యాంకు సాధించాడు.