FEMA Case | తమిళనాడుకు చెందిన అధికార పార్టీకి ఎంపీకి ఈడీ భారీ షాక్ ఇచ్చింది. ఆయన, కుటుంబీకులకు భారీగా జరిమానా విధించింది. విదేశీ మారకద్రవ్య నిబంధనలను ఉల్లంఘించిన కేసులో డీఎంకే ఎంపీ ఎస్ జగత్రక్షకన్ ఆయన కుటుంబ సభ్యులకు రూ.908కోట్ల జరిమానా విధించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం తెలిపింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ఉల్లంఘన కేసులో ఈ భారీ జరిమానా విధించినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఇక ఫెమా చట్టంలోని 37ఏ సెక్షన్ ప్రకారం 2020 సెప్టెంబర్లో సీజ్ చేసిన రూ.89.19 కోట్ల మొత్తాన్ని జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది.
ఫెమాలో చట్టంలోని సెక్షన్ 37ఏ ప్రకారం 2020లో సీజ్ చేసిన రూ.89.19 కోట్లను జప్తు చేయాలని.. రూ.908 కోట్లు జరిమానా విధించాలని ఆదేశించింది. ఆగస్ట్ 26న వెల్లడించిన తీర్పు ప్రకారం ఈ జరిమానా విధించినట్లు ఈడీ తెలిపింది. జగత్రక్షకన్ అరక్కోణం లోక్సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. 2021 డిసెంబర్ 1న, డీఎంకే ఎంపీ జగత్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యులు సంబంధిత కంపెనీపై ఫెమాలోని సెక్షన్ 16 కింద నిబంధనలను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి 2017లో సింగపూర్లోని షెల్ కంపెనీలో రూ.42 కోట్ల పెట్టుబడి పెట్టారని విచారణలో తేలింది. ఈ క్రమంలో ఈడీ చర్యలకు ఉపక్రమించింది.