పనాజీ: తీర రాష్ట్రం గోవాలో అసెంబ్లీ ఎన్నికల హవా నెలకొన్నది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతోపాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, బెంగాల్ సీఎం మమతాబెనర్జి నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ గోవాలో తన పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ఆయన.. గోవా పేదల కోసం తాము చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు ప్రతి నెల రూ.6000 చొప్పున అందజేస్తామన్నారు. అంటే ఒక్కో పేద కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఏడాదికి రూ.72 వేల లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని రంగాల్లో విఫలమైందని రాహుల్గాంధీ విమర్శించారు.
గోవాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో, కరోనా మహమ్మారి కట్టడిలో, ఉపాధి కల్పనలో బీజేపీ ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని మండిపడ్డారు. మేం నియంతలకు టికెట్ అసెంబ్లీ టికెట్లు ఇవ్వడంలేదని, కొత్తవాళ్లకు అవకాశం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.