CM Siddaramaiah | బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి బహుమతుల వివాదంలో చిక్కుకున్నారు. ఆయన గత పదవీ కాలంలో ఖరీదైన హుబ్లాట్ వాచ్ని బహుమతిగా స్వీకరించారని ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఆయన మరో బహుమతిని స్వీకరించారని జేడీఎస్ కర్ణాటక విభాగం అధ్యక్షుడు హెచ్డీ కుమార స్వామి ఆదివారం ఆరోపించారు.
ఓ మంత్రి తన మద్దతుదారుల ద్వారా సిద్ధరామయ్యకు రూ.1.9 కోట్ల విలువైన మంచం, రెండు జతల సోఫా సెట్స్ బహుమతిగా ఇచ్చారన్నారు. ఇది హుబ్లాట్ వాచ్ వివాదానికి అప్డేటెడ్ వెర్షన్ అన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితిని ఎదుర్కొనడానికి బదులుగా మంత్రుల బంగళాల ఆధునికీకరణ, కొత్త కార్ల కొనుగోలు కోసం ప్రజాధనాన్ని ప్రభుత్వం ఖర్చు పెడుతున్నదన్నారు. సీఎం నివాసంలో ఉన్న సమావేశ మందిరాన్ని ఆధునికీకరించేందుకు రూ.3 కోట్లు ఖర్చు చేయబోతున్నదని చెప్పారు.