ముంబై: తాను దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. అయితే రైలు అక్కడ ఆగలేదు. అది ఆగేదాక ఆ ప్రయాణికుడూ వేచి ఉండలేదు. అనుకున్నదే తడవుగా.. రైళ్లో నుంచి దిగేశాడు. అయితే రైలు వేగంగా వెళ్తుండటంతో పట్టు కోల్పోయాడు. ప్లాట్ఫామ్పై అడుగు కూడా పెట్టాడో లేదో కింద పడిపోయాడు. రైలు బోగీ అతడిని తాకుకుంటూ వెళ్లింది. దీంతో రైలుకు, ప్లాట్ఫామ్కు మధ్య పడిపోతున్నాడు. ఇది గమనించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ క్షణాల్లో వచ్చి అతడిని పక్కకు గుంజేశాడు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడినప్పటికీ.. రైలు డబ్బా బలంగా తాకడంతో కాలికి, నడుము భాగానికి గాయాలయ్యాయి. అనంతరం అతడిని దవాఖానకు తరలించారు. ఇదంతా ముంబైలోని బొరివాలి రైల్వే స్టేషన్లో గత నెల 29న (మంగళవారం) జరిగింది. ఈ ఘటన అక్కడే ఉన్న కెమెరాలో రికార్డయ్యింది. ఈ వీడియోను సెంట్రల్ రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతున్నది. క్షణాల్లో స్పందించిన ఆ కానిస్టేబుల్ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.