న్యూఢిల్లీ : రైళ్లలోని మహిళా కోచ్ల్లో ప్రయాణిస్తున్న 7 వేల మంది పురుషులను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పాటు హ్యుమన్ ట్రాఫికింగ్ నుంచి 150 మంది అమ్మాయిలను రక్షించారు.
ఆపరేషన్ మహిళా సురక్ష కార్యక్రమం కింద మే 3 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన డ్రైవ్లో భాగంగా అరెస్టులు చేసినట్లు ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. మహిళా ప్రయాణికులకు అత్యంత భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 283 పోలీసు బృందాలు 223 స్టేషన్లను కవర్ చేశాయన్నారు. రోజుకు 1,125 మంది మహిళా ఆర్పీఎఫ్ పోలీసులు ఈ డ్రైవ్లో పాలుపంచుకున్నారని తెలిపారు. ఈ డ్రైవ్లో భాగంగా 2.25 లక్షల మంది మహిళలతో మాట్లాడి, వారి భద్రతకు తీసుకోవాల్సిన అంశాలపై సలహాలు, సూచనలు స్వీకరించామని తెలిపారు.