లక్నో, జూలై 17: యూపీలోని మథుర మునిసిపల్ కార్పొరేషన్లో అతను ఓ పారిశుద్ధ్య కార్మికుడు. రోజూలాగే రోడ్డుపక్కన కుప్పగా ఉన్న చెత్తను తన తోపుడు బండిలో నింపుకొని వెళ్తున్నాడు. అయితే ఉన్నట్టుండి కొందరు భక్తులు అతన్ని చుట్టుముట్టారు. చెత్త బండిలో ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫొటోలను ఎందుకు వేశావని నిలదీశారు. అప్పటికి గానీ, ఆ కార్మికుడికి తన బండిలో వాళ్ల ఫోటోలు ఉన్నాయన్న విషయం తెలియలేదు. అప్పటికే నిశ్చేష్టుడైన ఆ కార్మికుడు.. భయంగా వారికి బదులిచ్చాడు.
‘ఆ ఫొటోలను చెత్తలో ఎవరో వేసినట్టున్నారు. చూసుకోకుండా వాటిని నా బండిలోకి ఎక్కించాను. నేనైతే ఆ ఫొటోలను చెత్తలో వేయలేదు’ అని ఆ కార్మికుడు పేర్కొన్నాడు. మోదీ, యోగి దేశానికి ఆత్మ వంటివారని పేర్కొంటూ వారి ఫోటోలను తీసుకున్న ఆ భక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెళ్తూ.. వెళ్తూ ఈ వీడియోను సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ కార్మికుడిపై అధికారులు వేటు వేశారు. ‘తెలియకుండానే ఆ కార్మికుడు ప్రధాని, సీఎం ఫొటోలను చెత్త బండిలో వేశాడు. అయినప్పటికీ, అతనిపై చర్యలు తీసుకున్నాం. ఉద్యోగం నుంచి తీసేశాం’ అని అధికారులు తెలిపారు.