ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఇటీవల జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మరణించడం పట్ల బీజేపీ ముంబై అధ్యక్షుడు అమిత్ సతమ్ నవ్వుతున్న వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే దీనిపై స్పందించారు. (Raj Thackeray) సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దీనిపై మౌనం వహించడాన్ని విమర్శించారు. అమిత్ సతమ్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మహారాష్ట్ర రాజకీయ సంస్కృతిని దెబ్బతీస్తుందని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం ఫడ్నవీస్ను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖను శనివారం ఎక్స్లో పోస్ట్ చేశారు.
కాగా, బీజేపీ కేంద్ర నాయకత్వం ‘అధికార మదంతో విర్రవీగుతోందని’ దేశవ్యాప్తంగా ప్రజలు నమ్ముతున్నారని, ఈ అంటువ్యాధి ఇప్పుడు మన రాష్ట్రానికి కూడా సోకిందా? మీరు దానిని వ్యాపిస్తున్నారా? అని రాజ్ ఠాక్రే ప్రశ్నించారు. ‘మీ ఎమ్మెల్యేలలో, కార్య నిర్వాహకులలో ఒకరు ప్రజల మరణాలపై ఆనందంగా నవ్వుతున్నారు. అయినా ఆయనపై ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఎవరికీ ఎలాంటి పశ్చాత్తాపం గానీ, విచారం గానీ లేదు. పైగా వీటన్నింటిపై మీరు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. అందుకే అందరూ పూర్తిగా సిగ్గులేనివారిగా మారిపోయారు’ అని విమర్శించారు.
మరోవైపు సున్నితమైన నేతగా దేవేంద్ర ఫడ్నవీస్కు ఉన్న ఇమేజ్ను కూడా రాజ్ ఠాక్రే ప్రశ్నించారు. ‘దేవేంద్ర ఫడ్నవీస్ ఒక సంస్కారవంతుడైన, సున్నిత మనస్కుడైన ముఖ్యమంత్రిగా కనిపించేవారు. మహారాష్ట్ర ప్రజలు అలాగే భావించారు, నేను కూడా అలాగే అనుకున్నా. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు ఏమాత్రం విచారం వ్యక్తం చేయకపోతే, మీ సున్నితత్వంపైనే అనుమానాలు తలెత్తుతాయి’ అని విమర్శించారు.
కాగా, మహారాష్ట్రలోని భిన్నమైన రాజకీయ సంప్రదాయాన్ని రాజ్ ఠాక్రే గుర్తు చేశారు. కేవలం ఒక రాజకీయ వర్గానికి చెందినవారన్న కారణంతో సహచరులను నాయకులు వెనకేసుకొచ్చే పద్ధతి ఇక్కడ లేదన్నారు. బాలాసాహెబ్, పవార్ సాహెబ్, ప్రమోద్జీ లేదా మరెవరైనా సరే, తమ సహచర నాయకులను వెనకేసుకు రాలేదని, అందుకే మహారాష్ట్ర రాజకీయాలకు దేశంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేదని తెలిపారు.
అయితే బీజేపీ ప్రభుత్వం దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని రాజ్ ఠాక్రే ఆరోపించారు. మంత్రులు ప్రతిరోజూ అత్యంత అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తుంటే మీరు ఏమీ అనడం లేదని సీఎం ఫడ్నవీస్పై మండిపడ్డారు. ముఖ్యమంత్రి గనుక ముందే జోక్యం చేసుకుని ఉంటే ఆ తప్పులను మళ్లీ చేసే ధైర్యం వారికి ఉండేది కాదని అన్నారు. ‘వాస్తవానికి, అంత సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్న వారి నుంచి మీరు రాజీనామాలు డిమాండ్ చేయాలి. విచ్చలవిడిగా ప్రవర్తించే వారిపై ఫడ్నవీస్ కఠిన చర్యలు తీసుకుంటారని ఒక్కసారి నిరూపించండి, అప్పుడు అందరూ దారిలోకి వస్తారు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.