న్యూఢిల్లీ: ఎల్పీజీ ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎన్డీయే కూటమికి చెందిన జేడీయూ డిమాండ్ చేసింది. కరోనా నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరల పెంపు పేదలపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతుందని బీహార్లో బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్న జేడీయూ పేర్కొంది. గృహిణుల వంటింటి బడ్జెడ్ భారాన్ని విపక్ష పార్టీలు వినియోగించుకుంటాయని, దీంతో భవిష్యత్తులో పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో మిత్రపక్షాల వైఖరి మారే అవకాశమున్నదని ఆ పార్టీ హెచ్చరించింది. చమురు సంస్థలు ఎల్పీజీ సిలిండర్ ధరను ఆగస్ట్ 18న తొలుత రూ.25 మేర పెంచగా, బుధవారం మరో రూ.25లు పెంచాయి. దీంతో గ్యాస్ వినియోగదారులు, ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు.
కాగా, జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇప్పటికే కేంద్ర వైఖరిపై కన్నెర్ర జేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్పై దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కుల ఆధారిత జనాభా గణన కోసం అఖిలపక్షంతో కలిసి ఇటీవల ప్రధాని మోదీని కలిశారు. బీజేపీ మౌనం వహిస్తున్న రాజకీయ అంశాలపై నితీశ్ పోరాటం ఇరు పార్టీల మధ్య దూరం పెంచవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.