న్యూఢిల్లీ, జూన్ 26: ఢిల్లీలోని బద్లీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రోహిణి జైలు వెనకాల ఉన్న ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలను ఆర్పడం అగ్నిమాపక అధికారులకు కూడా కష్టమైంది.
దీంతో రోబోను ఉపయోగించారు. రోబో సాయంతో వేగంగా నీళ్లను చల్లి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అగ్నిప్రమాదాల సమయంలో మంటలను ఆర్పేందుకు ఢిల్లీ ప్రభుత్వం మే నెలలో రెండు రోబోలను అగ్నిమాపక దళంలో ప్రవేశపెట్టింది.