న్యూఢిల్లీ: పోలీస్ డ్రెస్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక కారును ఆపి తనిఖీ చేశారు. అందులో ఉన్న రూ.50 లక్షలను దోచుకున్నారు. (Posing As Cops Loot 50 Lakh) ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగి కలెక్షన్ డబ్బుతో కారులో వెళ్తున్నాడు. ఇంద్రప్రస్థ ప్రాంతంలోని గఢ్ ఫ్లైఓవర్ సమీపంలో పోలీస్ డ్రెస్, వైర్లెస్ సెట్లతో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ కారును అడ్డుకుని ఆపారు. ట్రాఫిక్ పోలీసులుగా నమ్మించి కారులో తనిఖీలు చేశారు. అందులో ఉన్న రూ.50 లక్షల బ్యాగ్ను తీసుకున్నారు. కారు డిక్కీ తెరిచి తనిఖీ చేస్తూ ఆ డబ్బును అక్కడ ఉంచారు. ఇంతలో మరో బైక్పై వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు ఆ డబ్బుతోపాటు కారు డిక్కీలో ఉన్న మరో బ్యాగ్ను ఎత్తుకుపోయారు. పోలీస్ డ్రెస్లో వచ్చిన దొంగలు కూడా బైక్పై పారిపోయారు.
కాగా, ప్రైవేట్ సంస్థ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులుగా నమ్మించిన ఇద్దరితోపాటు మరో ఇద్దరు నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. వారిని అరెస్ట్ చేసేందుకు స్పెషల్ పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.