లక్నో : సొంత అత్తవారింటికే కన్నం పెట్టింది ఓ కోడలు. ఇంట్లో వారందరికీ తినే ఆహారంలో మత్తు మందు ఇచ్చి.. వారంతా నిద్రలోకి జారుకోగానే.. ఇంట్లో విలువైన ఆభరణాలన్నింటితో పరారైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. చందౌలీలోని ధర్మశాల ప్రాంతానికి చెందిన నరేంద్ర పాల్ సింగ్ అనే వ్యక్తి ప్లాస్టిక్ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి ఇద్దరు కొడుకులు గురుప్రీత్ సింగ్ సన్నీ, బల్వీందర్ సింగ్ లక్కీతో కలిసి ధర్మశాల ప్రాంతంలో నివసిస్తున్నారు. 2013లో గోండా జిల్లాకు చెందిన జతీందర్ కౌర్ సోనీతో గురుప్రీత్ వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు.
జతీందర్ కౌర్ వ్యాపారంలో భర్తకు సహాయం అందించేందుకు. నరేంద్ర పాల్ సింగ్ తన భార్య, ఇద్దరు కుమారులకు చెందిన ఆభరణాలను జతీందర్ కౌర్పై నమ్మకంతో ఆమె వద్ద ఉంచారు. ఇలా అంతాబాగానే నడుస్తున్న క్రమంలో బుధవారం రాత్రి కౌర్ సోనీ ఆహారంలో మత్తు మందు కలిపింది. కుటుంబీకులంతా నిద్రలోకి జారుకోగానే ఇంట్లో నుంచి లక్షల విలువైన నగలతో ఇంట్లో నుంచి పరారైంది. గురువారం ఉదయం నరేంద్ర పాల్ మనుమడు నిద్రలేని చేసి తన తల్లి ఇంట్లో లేదని కుటుంబీకులకు తెలిపాడు. దీంతో కుటుంబ సభ్యులంతా ఆమె కోసం వెతకడం ప్రారంభించారు.
ఈ క్రమంలో ఓ గదిలో ఉన్న లాకర్ తలుపు తెరిచి ఉంది. నేలపై నగలకు సంబంధించిన కవర్లు పడి ఉన్నాయి. లాకర్లో నగలు కనిపించకుండా పోయాయి. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. కౌర్ ఇంట్లో నుంచి పెద్ద బ్యాగ్తో బయటకు వెళ్లిపోవడం కనిపించింది. ఆమె మొబైల్ను స్విచ్ఛాఫ్ చేయగా.. ఆమె భర్త గురుప్రీత్ బంధువులను విచారించినా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. దీంతో చివరకు చేసేది లేక మొగల్సరాయ్ కొత్వాలికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, జతీందర్ కౌర్ కోసం గాలిస్తున్నారు.