బెంగళూరు : ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 20న కర్ణాటక రాజధాని బెంగళూరులో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే మోదీ పర్యటన నేపథ్యంలో.. ఆయన వెళ్లే మార్గంలోని రోడ్లను బాగు చేసేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలిక మొదట రూ. 23 కోట్లు ఖర్చు పెట్టింది. మోదీ పర్యటన ముగిసిన మరుసటి రోజు భారీ వర్షం వచ్చి ఆ రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి.
దీంతో మళ్లీ రోడ్లను బాగు చేసేందుకు రూ. 6.5 కోట్లు ఖర్చు చేసింది. రోడ్డు వేసి 24 గంటలు గడవకముందే ధ్వంసం కావడంతో సీఎం బసవరాజ్ బొమ్మై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బెంగళూరు మహానగర పాలిక అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. రోడ్లు నిర్మాణ పనులను పర్యవేక్షించిన ముగ్గురు ఇంజినీర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు.