Delhi Rains | దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. రెండ్రోజులుగా ఢిల్లీలో అత్యధిక వర్షపాతం రికార్డు కావడంతో సోమవారం పాఠశాలలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సెలవు ప్రకటించారు. కాగా, కేజ్రీవాల్ క్యాబినెట్ మంత్రి అతిషి ఇంటిని వరదలు ముంచెత్తిన వీడియోను బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఢిల్లీలో పరిస్థితులపై ఆప్ సర్కార్ తీరును తప్పుబట్టారు. మధుర రోడ్డులో ఇటీవల మరమ్మతులు చేసిన మంత్రి అతిషి ఇల్లు కూడా వరదల్లో మునిగి పోయిందని ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే వరద బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యలను మంత్రి అతిషి పర్యవేక్షిస్తున్నారు. మోటార్లతో నీటిని తోడేయాలని అధికారులకు సూచించామని ట్వీట్ చేశారు.
ఢిల్లీలో ఆదివారం కూడా భారీగా వర్షాలు కురవడంతో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఢిల్లీలో గత 41 ఏండ్లలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి అని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురవడంతో ప్రముఖులు నివసించే ప్రాంతాలతోపాటు చాణక్యపురి, భారతీ నగర్ తదితర ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తుతున్నది. సబ్జీ మండి వద్ద ఒక గోడ కూలడంతో మహిళ మరణించింది. ఒక బాలికకు గాయాలయ్యాయి. మరో ఘటనలో నలుగురు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరు అగ్నిమాపక దళ సిబ్బంది కూడా ఉన్నారని అధికారులు చెప్పారు.