లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉక్రెయిన్ సంక్షోభాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించడం పట్ల ఎస్పీ భాగస్వామ్య పక్షం ఆర్ఎల్డీ నేత జయంత్ చౌధరి మండిపడ్డారు. బహ్రెక్లో మంగళవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ సంక్షోభం సమయంలో ధృడమైన నాయకత్వం అవసరమని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ ప్రపంచంలో ఇప్పుడు తీవ్ర అలజడి చూస్తున్నామని..ఇలాంటి పరిస్ధితుల్లో భారత్ సహా మానవాళి అంతా దృఢంగా నిలబడాలని, ఇప్పుడు మీ ప్రతి ఒక్కరి ఓటు భారత్ను బలోపేతం చేస్తుందని మోదీ ఓటర్లకు పిలుపు ఇచ్చారు. ఆపై ఎస్పీ భాగస్వామ్య పక్షం ఆర్ఎల్డీ ఉగ్రవాదుల కొమ్ము కాస్తోందని కూడా ప్రధాని ఆరోపించారు. యూపీలో పలు పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులపై ఈ పరివార్వాదీలు ప్రేమ కురిపిస్తున్నారని ఈ ఉగ్రవాదులను జైళ్ల నుంచి విడిపించేందుకు వీరు కుట్రపన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉగ్ర సంస్ధలపై నిషేధాన్ని కూడా ఎస్పీ వ్యతిరేకిస్తుందని, 2008 అహ్మదాబాద్ పేలుళ్ల తీర్పుపై వారు మౌనంగా ఉన్నారని దుయ్యబట్టారు.
ప్రధాని ప్రకటనపై ఎస్పీ భాగస్వామ్యపక్షమైన ఆర్ఎల్డీ నేత జయంత్ చౌధరి భగ్గుమన్నారు. మోదీ ప్రతి అంశాన్నీ తనకు అనుకూలంగా అన్వయించుకుంటారని అన్నారు. ఉక్రెయిన్ను మోదీ యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తున్నారని ఆక్షేపించారు. యూపీ ఓటర్లు విద్యుత్ చార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, ఆర్ధికాభివృద్ధి, నిరుద్యోగంపై ప్రశ్నించకుండా ఉక్రెయిన్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చారని ఎద్దేవా చేశారు. ఇక ఎస్పీ, బీజేపీలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. నిరుద్యోగం, ధరల మంట, మహిళా సాధికారత, రైతులు, వ్యాపారుల కడగండ్ల వంటి అంశాల నుంచి బీజేపీ, ఎస్పీలు ప్రజల దృష్టి మళ్లిస్తూ ఉగ్రవాదంపై మాట్లాడుతున్నాయని ఆమె బుధవారం ఆరోపించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఒత్తిడితోనే ఆయా పార్టీలు మాట్లాడటం మొదలుపెట్టాయని దుయ్యబట్టారు. వీధి పశువుల వీరంగంతో యూపీలో రైతాంగం, ప్రజలు ఏండ్లతరబడి బాధపడుతుంటే ప్రధానికి ఈ విషయం ఇప్పుడే తెలిసిందని ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు.
ఉగ్రవాదం గురించి ఉపన్యాసాలు దంచుతూ యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. నాలుగో దశ ఎన్నికల సందర్భంగా వీధి పశువుల విషయంలో బాధితులకు యోగిజీ ఇప్పుడు ఎందుకు పరిహారం ప్రకటించారని ఆమె నిలదీశారు.గత రెండేండ్లుగా ప్రజా సమస్యలపై గళం విప్పిన 18,700 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులను అరెస్ట్ చేశారని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ వెల్లడయ్యేవరకూ ఎస్పీ, బీజేపీలు నిస్తేజంగా, మౌనంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో గెలుపొంది మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ ప్రయత్నిస్తుండగా, యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ సారధ్యంలోని ఎస్పీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక ప్రధాన పార్టీలకు దీటుగా సత్తా చాటేందుకు బీఎస్పీ, కాంగ్రెస్లు చెమటోడుస్తున్నాయి.