న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ఆయన మనుమడు, రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి రాజకీయంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజేపీతో జట్టు కట్టనున్నట్టు సంకేతం ఇచ్చారు. చరణ్ సింగ్కు భారతరత్న ప్రకటనపై శుక్రవారం ప్రధాని మోదీ పోస్టు చేసిన సరిగ్గా 13 నిమిషాలకు ఆ పోస్టును రీట్వీట్ చేస్తూ.. ‘దిల్ జీత్ లియా(హృదయాన్ని గెలుచుకొన్నారు)’ అంటూ జయంత్ పోస్టు చేశారు. తన తాత చరణ్సింగ్కు భారతరత్న పురస్కారం ప్రకటనపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. మోదీ సర్కార్పై ప్రశంసలు కురిపించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ‘బీజేపీతో పొత్తు కడుతారా?’ అని మీడియా జయంత్ చౌదరిని ప్రశ్నించగా.. ‘ఇంకేమైనా మిగిలుందా? దీన్ని నేను ఎలా తిరస్కరించగలను’ అంటూ సమాధానం ఇచ్చారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన త్వరలో సమాజ్వాదీ పార్టీతో పొత్తుకు గుడ్బై చెప్పి బీజేపీతో జట్టు కట్టనున్నారని ఇప్పటికే కొనసాగుతున్న ఊహాగానాలకు ఇది బలం చేకూర్చినట్టు అయింది.
ఈ రోజున మోదీ చేశారు..
‘గత ప్రభుత్వాలు చేయలేనిది, ఈ రోజున ప్రధాని మోదీ చేశారు. ఆయన గొప్ప నిబద్ధత, విజన్తో ఈ నిర్ణయం తీసుకొన్నారు’ అంటూ జయంత్ చౌదరి ప్రసంశలు కురిపించారు. దేశ సెంటిమెంట్, ఆలోచనలను ప్రధాని మోదీ అర్థం చేసుకొన్నారని అన్నారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పిన జయంత్ చౌదరి, ఇది తనకు చిరస్మరణీయమైన రోజు అని, భావోద్వేగమైన క్షణమని ఆనందం వ్యక్తం చేశారు. ‘ముగ్గురికి భారతరత్న ప్రకటించినందుకు రాష్ట్రపతి ముర్ము, బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీకి ధన్యవాదాలు. ఈ నిర్ణయంతో ప్రజల సెంటిమెంట్ ముడిపడి ఉన్నది’ అని జయంత్ పేర్కొన్నారు. ‘సీట్లు, ఓట్లు గురించి మాట్లాడటం.. ఈ రోజున తక్కువ చేసినట్టు అవుతుంది’ అని పేర్కొంటూ బీజేపీతో పొత్తుపై సూటిగా సమాధానం ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేశారు.
ఎస్పీతో పొత్తుకు త్వరలో గుడ్బై!
చరణ్ సింగ్కు భారతరత్న ప్రకటన యూపీలో రాజకీయ మార్పులకు దారితీసే అవకాశం ఉన్నది. ఆర్ఎల్డీ అధినేత జయంత్చౌదరి ఎస్పీ పార్టీ పొత్తు వీడి అధికార బీజేపీకి జట్టు కడుతారని, ఆ వ్యూ హంలో భాగంగానే చరణ్ సింగ్కు కేంద్రం భారతరత్న ప్రకటించిందనే విశ్లేషణలు వినిపిస్తున్నా యి. బీజేపీ-ఆర్ఎల్డీ మధ్య పొత్తుపై ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలోనే చరణ్ సింగ్కు భా రతరత్న ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. పొత్తు కుదిరితే పశ్చిమ యూపీలో రైతులు, జాట్లలో బలంగా ఉండే ఆర్ఎల్డీకి రెండు లోక్సభ స్థానాలతోపాటు ఒక రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తున్నది.
జయంత్తోమాట్లాడలేదు: అఖిలేశ్
చరణ్ సింగ్కు భారతరత్న ప్రకటనను స్వాగతించిన ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. ఆర్ఎల్డీ కటీఫ్ వార్తలను ఖండించారు. తాను ఈ విధమైన ప్రచారాన్ని మీడియాలో చూస్తున్నానని, మీ నుంచే వింటున్నానంటూ విలేకరులతో అన్నారు. చరణ్ సింగ్కు భారతరత్న ప్రకటన తర్వాత తాను జయంత్తో మాట్లాడలేదన్నారు.