లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజ్నోర్లో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించాల్సిన ర్యాలీ రద్దు కావడం పట్ల రాష్ట్రీయ లోక్దళ్ చీఫ్ జయంత్ చౌధరి స్పందించారు. యూపీలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని ఎద్దేవా చేశారు. బిజ్నోర్లో ప్రధాని స్వయంగా ర్యాలీలో పాల్గొని ప్రసంగించాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దు చేసుకున్నారు. ఆపై ర్యాలీకి యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ హాజరయ్యారు. ప్రతికూల వాతావరణంతో ప్రధాని హెలికాఫ్టర్ ల్యాండ్ కాలేకపోతోందని తాను కూడా సభా వేదికకు ఆలస్యంగా చేరుకున్నానని యోగి వివరణ ఇచ్చారు.
అయితే బిజ్నోర్లో వాతావరణ పరిస్ధితులు బాగానే ఉన్నాయని జయంత్ చౌధరి ట్వీట్ చేశారు. బిజ్నోర్లో సూర్యుడు ప్రకాశిస్తున్నాడని..బీజేపీ పరిస్ధితే బాగా లేదని చురకలు వేశారు. బిజ్నోర్ ర్యాలీలో 1000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక వర్చువల్గా ప్రధాని మోదీ బిజ్నోర్, మొరదాబాద్, అమ్రోహ జిల్లాలకు చెందిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 18 నియోజకవర్గాల పరిధిలోని కార్యకర్తలతో మోదీ ముచ్చటించారు.
ఇక యూపీలో మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, యోగి ప్రభుత్వంపై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ చెమటోడుస్తోంది. ప్రియాంక గాంధీ ఇమేజ్తో సత్తా చాటాలని కాంగ్రెస్ పావులు కదుపుతుండగా, దళితులు, అణగారిన వర్గాల వెన్నుదన్నుతో ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇచ్చేందుకు మాయావతి సారధ్యంలోని బీఎస్పీ కసరత్తు సాగిస్తోంది. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి ఏడు వరకూ ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.