పట్నా : పశుగ్రాస కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్కు ఐదేండ్ల జైలు శిక్ష, రూ 60 లక్షల జరిమానా విధించిన నేపధ్యంలో పశుగ్రాస కుంభకోణంలో బిహార్ సీఎం నితీష్ కుమార్కు కూడా ప్రమేయం ఉందని ఆర్జేడీ ఉపాధ్యక్షుడు శివానంద్ తివారీ ఆరోపించారు. పశుగ్రాస స్కాం ప్రధాన సూత్రధారి శ్యాం బిహారి సిన్హా నుంచి నితీష్ కుమార్ డబ్బు తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
నితీష్ కుమార్కు ప్రధాని మోదీ సోషలిస్ట్ నేత సర్టిఫికెట్ ఇచ్చారని తివారీ చెప్పుకొచ్చారు. పశుగ్రాస కుంభకోణంలో నితీష్ కుమార్ పాత్ర ఉందని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ ఆరోపించారని, జార్ఖండ్ (అప్పటి బిహార్) ట్రెజరీల నుంచి అక్రమ విత్డ్రాయల్స్ అనంతరం నితీష్కు ముడుపులు ముట్టాయని చెప్పారని తివారీ గుర్తుచేశారు. ఈ ఆరోపణలను అంగీకరించే ధైర్యం నితీష్కు ఉందా అని ఆయన నిలదీశారు.
మరోసారి ఇవే ఆరోపణలు చేయాలని తాను సుశీల్ మోదీకి సవాల్ విసురుతున్నానని తివారీ అన్నారు. ఈ స్కాంలో ప్రధాన సూత్రధారి శ్యాం బిహారి సిన్హాను తన జీవిత కాలంలో కలవలేదని నితీష్ చెప్పగలరా అని ప్రశ్నించారు. శ్యాం బిహారితో నితీష్కు సంబంధాలు ఉన్నాయని, ఈ కేసులో నితీష్కు డబ్బు ముట్టిందని తివారీ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో లాలూ ప్రసాద్కు వ్యతిరేకంగా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ కోర్ఠులో పిటిషన్ వేసిన వారిలో తాను ఒకరినని తివారీ చెప్పారు.