పట్నా : ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ పర్యటనకు ముందు ప్రత్యేక హోదా డిమాండ్ను ఆర్జేడీ మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. బిహార్ అసెంబ్లీ శతాబ్ధి వేడుకల ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ మంగళవారం బిహార్లో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆర్జేడీ నేత శక్తి యాదవ్ డిమాండ్ చేశారు.
బిహార్కు ప్రత్యేక హోదా డిమాండ్ దీర్ఘకాలంగా వినిపిస్తున్నదని, ఈ హామీ నెరవేర్చేందుకు ప్రధాని మోదీకి ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు. బిహార్ ఉభయసభల్లో ప్రత్యేక హోదాను కోరుతూ తీర్మానాలు ఆమోదించామని ఆయన గుర్తుచేశారు. బిహార్ అసెంబ్లీ శతాబ్ధి వేడుకల్లో ఈ హామీని నెరవేర్చేందుకు ప్రధానికి సరైన సందర్భంగా శక్తి యాదవ్ పేర్కొన్నారు.
ప్రధాని బిహార్ పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైన బీజేపీ ప్రత్యేక హోదాను ఆర్జేడీ ఈ సందర్భంలో తెరపైకి తీసుకురావడాన్ని తప్పుపడుతోంది. కేంద్రంలో కాంగ్రెస్ కూటమితో కలిసి ఉన్న సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఎందుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేదని బీజేపీ ప్రతినిధి అర్వింద్ కుమార్ సింగ్ ఆర్జేడీని నిలదీశారు. లాలూ బిహార్కు ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన సమయంలో పశుదాణా కుంభకోణంలో బిజీ అయ్యారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ బిహార్ పర్యటనకు వస్తున్న సమయంలో ఆర్జేడీకి హోదా విషయం గుర్తుకువచ్చిందని సింగ్ వ్యాఖ్యానించారు.