పట్నా : బిహార్ రాజధాని పట్నాలో రూ 220 కోట్లతో నిర్మించిన రాష్ట్ర హైవేను సీఎం నితీష్ కుమార్ ప్రారంభించిన రోజే రహదారిపై పగుళ్లు బయటపడ్డాయని ఆర్జేడీ నేత చంద్రహాస్ చౌపల్ పేర్కొన్నారు. హైవే నిర్మాణంలో భారీ అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. సీఎం ఈ హవేను ప్రారంభించిన రోజే ఐదు కిలోమీటర్ల రహదారి పొడవునా పలు చోట్ల పగుళ్లు, గుంతలు కనిపించాయని అన్నారు.
నాసిరకం మెటీరియల్ను వాడటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని ఆర్జేడీ నేత డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం నితీష్ కుమార్ బుధవారం రూ 1121 కోట్లతో చేపట్టిన 130 కిలోమీటర్ల పొడవైన నాలుగు రాష్ట్ర హైవేలను బుధవారం ప్రారంభించారు.
కాగా నూతనంగా నిర్మించిన రోడ్లలో కొన్ని ప్రాంతాల్లో 12 రోజులుగా వరద నీరు చేరడంతో అక్కడక్కడా పగుళ్లు ఏర్పడ్డాయని, వరద నీరు ఉండటంతో కాంక్రీట్ ఫెన్సింగ్ వర్క్ చేపట్టలేకపోయామని, ప్రస్తుతం మరమ్మత్తులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.