పట్నా: ఉద్యోగాలకు భూమి కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఈడీ ముందు హాజరయ్యారు. సోమవారం ఉదయం పాట్నాలోని ఈడీ (ED) కార్యాలయానికి చేరుకున్న ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. భూములు తీసుకుని రైల్వే ఉద్యోగాలు కట్టబెట్టారన్న ఆరోపణలతో నమోదైన మనీ లాండరింగ్ కేసులో లాలూ, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్కు ఈడీ సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో లాలూ సతీమణి రబ్రీ దేవి, ఆయన కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్లకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీచేసింది. ఫిబ్రవరి 9న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. కాగా, కుమార్తె మీసా భారతితో కలిసి లాలూ ఈడీ కార్యాలయానికి రావడంతో.. ఆర్జేడీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈడీతోపాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-1 కేబినెట్లో లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో భూములు తీసుకుని రైల్వే ఉద్యోగాలు అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2004-2009 మధ్యకాలంలో వివిధ జోన్లలో గ్రూప్-డీ ఉద్యోగాలను అభ్యర్థులు లేదా వారి బంధువుల నుంచి ప్లాట్లను బహుమతులుగానో లేదా తక్కువ ధరలకు తీసుకున్నారని లాలూ కుటుంబంపై కేసు నమోదయింది. ఈ వ్యవహారంపై సీబీఐతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.