శరద్ యాదవ్ తన పార్టీని లాలూ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్లో ఆదివారం విలీనం చేశారు. లోక్ తాంత్రిక్ జనతాదళ్ను ఆర్జేడీ విలీనం చేస్తున్నట్లు శరద్ యాదవ్ ప్రకటించారు. విపక్షాల ఏకీకరణకు ఈ విలీనం ఓ నాందీ ప్రస్తావనగా ఆయన అభివర్ణించారు. కేంద్రంలోని బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మొట్ట మొదట ప్రతిపక్షాల మధ్య ఐక్యత కుదరాలని, ఆ తర్వాత దానిని ఎవరు ముందుకు తీసుకెళ్లాలో ఆలోచిస్తామని స్పష్టం చేశారు.
25 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇద్దరు ఒక్కటయ్యారు. బిహార్ రాజకీయంలో ఓ కొత్త మలుపు అనే చెప్పాలి. శరద్ యాదవ్ తన పార్టీని లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా సార్లు వీరిద్దరి మధ్య రాజకీయ వైరం నడిచింది. ఒకరిపై ఒకరు రాజకీయంగా తీవ్ర విమర్శలే చేసుకున్నారు. 1997 లో లాలూ ప్రసాద్ యాదవ్ జనతాదళ్ నుంచి వేరుపడి, రాష్ట్రీయ జనతాదళ్ అన్న సొంత కుంపటిని పెట్టుకున్నారు. ఆ తర్వాత నితీశ్ కుమార్తో కలిసి, శరద్ యాదవ్ చాలా కాలం ప్రయాణించారు. ఇద్దరి మధ్యా పొరపొచ్చాలు రావడంతో శరద్ యాదవ్ లోక్ తాంత్రిక్ జనతాదళ్ అనే పార్టీని స్థాపించారు. ఇప్పుడు దీనిని లాలూ ప్రసాద్ పార్టీలో విలీనం చేశారు.
ప్రజల డిమాండ్ల మేరకే : తేజస్వీ
శరద్ యాదవ్ తన పార్టీని ఆర్జేడీలో విలీనం చేయడంపై ఆ పార్టీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్ స్పందించారు. ప్రజల డిమాండ్ మేరకే ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలకు ఓ మెసేజ్ ఇచ్చినట్లైందన్నారు. దీనిని చూసైనా.. ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని తేజస్వీ యాదవ్ అన్నారు.